చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

-కాశిపెంట్ల వద్ద ఢీకొన్న రెండు బస్సులు -ప్రమాదంలో ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు -36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

Update: 2020-01-08 04:25 GMT
Representational image

ఏపీలోని చిత్తూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అమరావతి వోల్వో బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిలోని కాశిపెంట్ల సమీపంలో జరిగింది. వోల్వో బస్సు విజయవాడ నుంచి కుప్పం వెళ్తుండగా, శబరిమల నుంచి నల్లగొండకు అయ్యప్ప భక్తుల బృందంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటికి తీయడానికి గ్యాస్ కట్టర్‌తో బస్సులను కట్ చేసి తొలగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో లారీలో తిరుపతికి తరలించారు. ఘటనతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్షతగాత్రులను రూయా ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News