ప్రయాణికుల భద్రత కంటే అతివేగానికే ప్రాధాన్యత ఇస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిత్య ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అత్యాధునిక వాహనాలను అర్హత, అనుభవం లేని డ్రైవర్లకు అప్పగిస్తూ ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పింది. ప్రయాణికులతో హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో పక్కనున్న పంట కాలువలోకి బస్సు వెళ్లింది. దీంతో బస్సు ముందు భాగం కాలువలో కూరుకుపోగా వెనుకభాగం గాల్లో తేలియాడింది. ఘటనలో ఎవరికీ ఏం జరగకపోయినా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. స్థానికుల సహకారంతో ఒక్కొక్కరు బస్సు నుండి బయటపడ్డారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.