వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు కళకళలాడుతున్నాయి. వేకువజాము నుండే భారీ ఎత్తున భక్తులు దేవాలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజున.... శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ మైన శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రావణ వాహనంపై పురవీధుల గుండా ఊరేగిన భ్రమరాంబ మల్లికార్జున సమేతుడై ఉత్తర ద్వారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. పూజారులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయాధికారులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు.
అనంతపురం జిల్లా:
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. అనంతపురం నగరంలో చెన్నకేశవ స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు జనం బారులు తీరారు.
తిరుమల:
ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమల సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, విశ్వరూప్, చీఫ్ విఫ్ శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, చినరాజప్ప, సినీనటి, మాండ్య ఎంపీ సుమలత తదితరులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.