Nimmala Rama Naidu: అధికారులతో.. మంత్రి నిమ్మలరామానాయుడు వీడియో కాన్ఫరెన్స్
Nimmala Rama Naidu: చెరువులకు, కాల్వలకు పడ్డ గండ్లు వెంటనే పూడ్చాలి
Nimmala Rama Naidu
Nimmala Rama Naidu: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్లు, కాలువలను వెంటనే గుర్తించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన గండ్ల మరమ్మతు పనులు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రణాళిక సిద్ధం చేసి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 45వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఫ్లడ్ మెనేజ్మెంట్ సరిగ్గా చేయడం వల్ల నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుతం 7లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్టు తెలిపారు.
గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కొల్లేరు అవుట్ ఫ్లో పెంచడానికి అడ్డంకిగా ఉన్న గుర్రపుడెక్క కిక్కీసను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వరదనీటితో రాయలసీమకు సంబంధించిన రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నింపి ప్రతిరోజూ నివేదిక అందించాలని సూచించారు.