Ambati Rambabu: అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు: నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. జైలు నుంచి గుంటూరుకు తరలింపు!
Ambati Rambabu: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Ambati Rambabu: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నేడు గుంటూరు కోర్టులో ఆయనకు సంబంధించిన నాలుగు కీలక పిటిషన్లపై విచారణ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పోలీసుల పీటీ వారెంట్.. పాత కేసుల రీ-ఓపెన్!
గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లడం, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో అంబటిని విచారించేందుకు పోలీసులు గుంటూరు కోర్టులో పీటీ (Prisoner Transit) వారెంట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
నేడు కోర్టులో విచారణకు రానున్న నాలుగు పిటిషన్లు:
అంబటి రాంబాబు భవిష్యత్తును తేల్చేలా నేడు కోర్టులో ఈ క్రింది అంశాలపై విచారణ జరగనుంది. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్. కేసు విచారణ నిమిత్తం అంబటిని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల అభ్యర్థన. పట్టాభిపురం పీఎస్ కేసులో విచారణకు అనుమతి. రాజమండ్రి జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలని అంబటి తరపు న్యాయవాదుల పిటిషన్.
రాజమండ్రి నుంచి గుంటూరుకు తరలింపు
వరుస పిటిషన్లపై విచారణ నేపథ్యంలో పోలీసులు అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి భారీ భద్రత మధ్య గుంటూరుకు తరలిస్తున్నారు. ఆయనపై మరిన్ని పాత కేసులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఆ కేసుల్లో కూడా పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.