Nara Lokesh: "రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టి మాపై విమర్శలా?": వైసీపీని నిలదీసిన లోకేశ్
Nara Lokesh: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరిగింది.
Nara Lokesh: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం రూ.4,000 కోట్ల బకాయిలు పెట్టిందని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతోందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళం చెలరేగింది.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,000 కోట్లకు పెరిగాయని ఆరోపించారు. కోవిడ్ సమయంలో రూ.644 కోట్లు, ఆర్టీఎఫ్ కింద రూ.3,000 కోట్లు, ఎంటీఎఫ్ కింద మరో రూ.895 కోట్లు పెండింగ్లో పెట్టారని విమర్శించారు. "ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెట్టిన మీరు ఇప్పుడు ఎలా మాట్లాడతారు?" అని ఆయన నిలదీశారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన రూ.1,400 కోట్ల బకాయిలను రాబోయే మూడు నెలల్లోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణపై లోకేశ్ విరుచుకుపడ్డారు. బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తమ అసమర్థత బయటపడుతుందనే భయంతోనే అక్కడ ఈ విషయం లేవనెత్తలేదని ఆరోపించారు. విద్యా రంగంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. గతంలో ఈ అంశంపై చర్చ జరుగుతుంటే బొత్స సహా ఇతర వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, దానిపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
దీనిపై బొత్స స్పందిస్తూ, సభలో పరుషపదాలు వాడొద్దని సూచించారు. లోకేశ్ బదులిస్తూ, తాను ఎవరినీ అగౌరవపరచలేదని, "బొత్స గారు" అనే సంబోధించానని స్పష్టం చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని, తాను వాడిన పరుషపదజాలం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అందరినీ గౌరవిస్తానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.