కనిపెంచిన చేతులే కాటేశాయి..కన్న కూతుళ్లనే బలి ఇచ్చిన తల్లి

Update: 2021-01-25 06:20 GMT

కనిపెంచిన చేతులే కాటేశాయి..కన్న కూతుళ్లనే బలి ఇచ్చిన తల్లి

 కనిపెంచిన చేతులే కాటేశాయి. క్షుద్రపూజల పేరుతో అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూఢనమ్మకాలపై నలుగురికి అవగాహన కల్పించాల్సిన ఆ దంపతులు దుర్మార్గంగా ప్రవర్తించారు. మంత్రాలు, తంత్రాలు ఆ పై పరాకాష్టకు చేరిన పరమ భక్తికి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడబిడ్డలను బలిచ్చింది ఆ కర్కశ తల్లి. ఉన్నత విద్యావంతుల కుటుంబం భక్తి మాయలో పడింది. దాంతో అది కూడా పీకల్లోతు మునిగిపోయారు. క్షుద్రపూజలు చేసి ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది.


మదనపల్లె పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన పురుషోత్తమనాయుడు, పద్మజ ఉన్నతంగా చదువుకున్నారు. పురుషోత్తంనాయుడు మదనపల్లె మహిళా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. భార్య పద్మజ ఓ ప్రైవేట్ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌ గా పనిచేస్తున్నారు. అంతేకాదు మ్యాథ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. వీరికి అలేఖ్య, సాయి దివ్య పిల్లలున్నారు. పిల్లలు తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి నిన్నటిదాకా భోపాల్‌ పీజీ చేస్తుండగా చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.

 ఉన్నతంగా చదువుకున్న ఈ కుటుంబంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అంతులేని భక్తి, నమ్మకం ఆ కుటుంబాన్ని నాశనం చేసింది. దివ్యశక్తుల ఆవాహన కోసమంటూ ఇద్దరు ఆడపిల్లలను అతి దారుణంగా తల్లే కడతేర్చింది. జాతీయ బాలికల దినోత్సవం నాడే పూజలు చేసి ఇంటి మహాలక్ష్ములను హత్య చేశారు. డంబెల్‌తో కొట్టి మరీ పెద్ద కూతురు అలేఖ్యను దారుణంగా హత్య చేసింది పద్మజ. ఇది చూసిన సాయిదివ్య అరుస్తు బయటకు వచ్చింది. కానీ, ఎవరూ ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేదు. ఆ తర్వాత ఆమెను కూడా హత్య చేసింది.

కూతుళ్లను హత్య చేసే ముందు మూడు రోజుల నుంచి ఇంట్లో పూజలు చేసినట్టు తెలుస్తోంది. కరోనా వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి రావడంతో పూజలు పెంచేశారు. నిత్యం పూజలు, భక్తిలో మునిగారు. ఈ క్రమంలో మూడు రోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపి లేకుండా పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం తల్లితో సహా ఇద్దరు పిల్లలు పూజలు చేశారు. ఈ క్రమంలో పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ డంబెల్‌తో కొట్టి చంపేసింది. చనిపోయిన అలేఖ్యను బతికించుకొనేందుకు రెండో కూతురు సాయిదివ్యను బెడ్‌ రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుట పద్మజ చంపేసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పద్మజ మానసిక స్థితి బాగలేదని తెలుస్తోంది.


Tags:    

Similar News