Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య ఇచ్చేది నాటుమందు, ఆయుర్వేదం కాదు

Anandayya Mandu: ఆనందయ్య ఇచ్చేది నాటుమందు, ఆయుర్వేదం కాదని రాష్ట్ర ఆయుష్ శాఖ తెలిపింది

Update: 2021-05-23 04:40 GMT

Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య మందు సంజీవని కాదో అవునో ఆయుష్ తేల్చలేకపోయింది. కరోనాను అది తరిమికొడుతుందో లేదో తెలియదంటున్నారు. పైగా ఇది ఆయుర్వేదం కాదు.. నాటు మందు అని రాష్ట్ర ఆయుష్ శాఖ తెలపింది. ఈ నాటు మందు పని చేయొచ్చు చేయకపోవచ్చన్నమాట. కాని డేంజర్ అయితే కాదని చెబుతున్నారు. అంటే ఒక ట్రయల్ వేసుకోవచ్చన్నట్లే చెబుతున్నారు.

కరోనాకు ఆనందయ్య మందు వాడాలా? వద్దా? అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు నేతృత్వంలో రెండు రోజులపాటు కృష్ణపట్నంలో పర్యటించిన వైద్యబృందం ఆనందయ్య మందును పరిశీలించింది. అక్కడికి వెళ్లడానికి ముందే ఆనందయ్య కరోనా మందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. ఆ ఫలితాలు, ఆనందయ్య ఇచ్చిన వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆనందయ్య ఇచ్చేది నాటు మందుగా గుర్తించినట్టు రాములు తెలిపారు.

ఈ మందులో హానికారక పదార్థాలు లేవని, అయితే, దానిని ఆయుర్వేద మందుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితులపై ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ కు నివేదిక పంపిస్తామన్నారు. కాగా, ఆనందయ్య ఇచ్చే మందులో పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప చిగురు, మారేడు చిగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటి ముడి పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తున్నారు.

కర్నల్ బృందం రెండు రోజుల పర్యటనలో తొలి రోజు మందు కోసం వచ్చిన వారిని కలుసుకుని వారి అభిప్రాయాలు సేకరించింది. ఈ మందును వాడిన వారి నుంచి కూడా వివరాలు సేకరించింది. వారంతా మందు వినియోగం పై సానుకూలత వ్యక్తం చేశారు. తమ బృంద పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కర్నల్ రాములు వెల్లడించారు. మరోవైపు, ఆనందయ్య మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు వస్తుందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News