TSRTC: ముగిసిన ఆర్టీసీ కార్మికుల 2 గంటల నిరసన..
TSRTC: కాసేపట్లో ఆర్టీసీ కార్మికుల రాజ్భవన్ ముట్టడి
TSRTC: ముగిసిన ఆర్టీసీ కార్మికుల 2 గంటల నిరసన..
TSRTC: కాసేపట్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాజ్భవన్ను ముట్టడించనున్నారు. ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే బిల్లును ఆమోదించి అసెంబ్లీకి పంపాలని కార్మికులు డిమాండ్ చేస్తూ.. ఇవాళ రాజ్భవన్ ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది.
రాజ్ భవన్ ఉద్ధేశపూర్వకంగానే ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును ఆమోదించలేదని ఆర్టీసీ కార్మిక సంఘం ఆరోపిస్తోంది. 43వేల కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, విలీన బిల్లుకు త్వరితగతిన ఆమోద ముద్ర వేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
టీఎంయూ పిలుపుతో ఇవాళ తెల్లవారుజామునే డిపోల వద్దకు ఆర్టీసీ కార్మికులు చేరుకుని నిరసనకు దిగారు. రెండు గంటల పాటు బస్సు సర్వీసులను స్తంభింపజేశారు. కాసేపట్లో రాజ్ భవన్ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నారు. కార్మికులంతా పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజాకు చేరుకుని అక్కడి నుంచి ప్రదర్శనగా రాజ్ భవన్ చేరుకోనున్నారు.
ఇక ఆర్టీసీ ముసాయిదా బిల్లుపై రాజ్భవన్ వర్గాలు మరోసారి క్లారిటీ ఇచ్చాయి. బిల్లుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేదని తెలిపాయి. బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని.. సరైన వివరణ అందితే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని రాజ్భవన్ వెల్లడించింది.