MLA Sanjay Kumar: ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్‌చిట్.. ఇప్పటివరకు 8 మందికి లైన్ క్లియర్!

MLA Sanjay Kumar: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-02-04 06:06 GMT

MLA Sanjay Kumar: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్‌కు పిటిషన్ సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన స్పీకర్.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సభ్యత్వంపై ఎలాంటి వేటు పడదని తేల్చి చెప్పారు.

తెలంగాణలో ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వరుసగా నిర్ణయాలు వెలువరిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌తో కలిపి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం గమనార్హం. గత కొద్ది రోజులుగా ఈ అనర్హత పిటిషన్ల ప్రక్రియ వివిధ దశల్లో సాగుతుండగా, ఒక్కొక్కరి విషయంలో స్పీకర్ స్పష్టతనిస్తున్నారు.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ వేగంగా విచారణ పూర్తి చేస్తున్నప్పటికీ, తగిన ఆధారాలు లేవనే సాకుతో పిటిషన్లు కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజా నిర్ణయంతో జగిత్యాల రాజకీయాల్లో సంజయ్ వర్గం పండగ చేసుకుంటుండగా, ప్రతిపక్షం తదుపరి అడుగులు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News