రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయవాది దారుణ హత్య.. పొలం వద్దే మెడ కోసి చంపిన సోదరుడు.
ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే.. కనికరం లేకుండా సొంత చెల్లెలిని కత్తితో నరికి చంపిన ఘోర ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం రేపింది.
ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే.. కనికరం లేకుండా సొంత చెల్లెలిని కత్తితో నరికి చంపిన ఘోర ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కలకలం రేపింది.
కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెకు, ఆమె సోదరుడికి మధ్య ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం పొలం వద్ద ఆస్తి పంచాయితీ జరుగుతుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
స్థానికుల సమాచారంతో మొయినాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
తోటి న్యాయవాది హత్యకు గురవ్వడంతో చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.