MLA Sanjay Kumar: నేనింకా బీఆర్ఎస్ సభ్యుడినే.. అభివృద్ధి కోసమే సీఎంను కలిశా
MLA Sanjay Kumar: తన రాజకీయ భవిష్యత్తు మరియు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎట్టకేలకు తెరదించారు.
MLA Sanjay Kumar: తన రాజకీయ భవిష్యత్తు మరియు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎట్టకేలకు తెరదించారు. తాను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే, రాబోయే ఎన్నికల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాను ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని సంజయ్ వెల్లడించారు. "అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిస్తే.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు దుష్ప్రచారం చేశారు. నా వివరణ కూడా తీసుకోకుండా నా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు, నా ఆసుపత్రి, ఇంటిపై దాడులకు తెగబడ్డారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు లేఖ రాయడంపై సంజయ్ స్పందిస్తూ.. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తాను పార్టీ అధిష్టానాన్ని కానీ, స్థానిక నాయకులను కానీ ఎక్కడా విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు.
తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతూనే.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వైఖరితో సంజయ్ కుమార్ భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటారనేది ఇప్పుడు కేడర్లో గందరగోళానికి దారితీస్తోంది.