Disha Case:తదుపరి ఆదేశాలిచ్చేవరకూ మృతదేహాలను భద్రపరచండి..సుప్రీం కోర్టు ఆదేశాలు!
దిశా హత్యోదంతంలో ఎంకౌంటర్ కు గురైన నిందితుల మృత దేహాలను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ భద్రపరచి ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దిశ హత్యోదంతంలో మృత దేహాల అపపగింతకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఈ అంశం పై గురువారం (12-12-2019) రాత్రి కీలక ఆదేశాలతో కూడిన ఒక ప్రకటనను సుప్రీం కోర్టు వెలువరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మృతదేహాలను భద్రపరఛి ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
మరోవైపు ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. మృతదేహాల అప్పగింత వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తేవడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
మృతదేహాలు అప్పగించాలనే పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం విచారణ జరపాల్సి ఉంది. సుప్రీం తాజా ఆదేశాలతో హైకోర్టులో విచారణకు బ్రేక్ పడినట్టైంది. ప్రస్తుతం దిశ హత్య కేసులో నలుగురు నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలో ఉన్నాయి. దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో రెండో రోజైన గురువారం విచారణ కొనసాగింది.
ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో సర్వో్న్నత న్యాయస్థానం త్రిసభ్య విచారణ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్లో సరైన చోట ఉండి విచారణ చేయాలని ఈ కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ అవసరాలు, ఖర్చులను కూడా తెలంగాణ ప్రభుత్వమే తీర్చాలని ఆదేశించింది. తొలి విచారణ తేదీ విచారణ కమిషన్కు నేతృత్వం వహిస్తున్న వారి ఇష్టమేనని.. విచారణ చేపట్టిన నాటి నుంచి ఆరు నెలల్లో కోర్టుకు నివేదిక అందించాలని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.