Weather Update : తెలుగు రాష్ట్రాలకు పిడుగుల గండం.. రాబోయే 3 రోజులు బీభత్సమైన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Weather Update : ఏపీ, తెలంగాణలో రాబోయే మూడు రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే మూడు రోజులు (ఏప్రిల్ 7, 8, 9) ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రస్తుతం భూతాపం పెరగడం వల్ల సముద్ర మట్టాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. దీని ఫలితంగానే అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఒక ఆవర్తనం ఏర్పడి ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు తెలంగాణ నుంచి రాయలసీమ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఏపీలో వాతావరణ పరిస్థితి
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేడు రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా జల్లులు పడవచ్చు. నిన్న ఏలూరు జిల్లాలో కనిపించిన ప్రళయం లాంటి వాతావరణం మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏలూరులో నిన్న కురిసిన భారీ వర్షానికి చెట్లు కూలిపోవడమే కాకుండా, హోర్డింగులు కూడా ఎగిరిపడ్డాయి. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కూడా 35 నుండి 38 డిగ్రీల వరకు ఉంటుంది.
తెలంగాణలో పరిస్థితి
తెలంగాణలో పగటిపూట ఎండలు మండిపోతున్నా, సాయంత్రం అయ్యేసరికి బంగాళాఖాతం నుంచి వచ్చే చల్లని మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గంటకు 18 నుంచి 28 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంటలు దెబ్బతిన్న రైతులు, రాబోయే మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం నిల్వలు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
పిడుగుల బీభత్సం.. ఇద్దరు బలి
నిన్న మార్కాపురం ప్రాంతంలో పిడుగులు పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పని ముగించుకుని ఇంటికి వస్తున్న ఒక రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లడం, పొలాల్లో ఉండటం అత్యంత ప్రమాదకరమని వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది. పిడుగులు పడేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం మేలు.
అంతర్జాతీయ తుపాన్ల ప్రభావం
ప్రస్తుతం ఆస్ట్రేలియా సమీపంలో మైలా, వలను అనే రెండు శక్తివంతమైన తుపాన్లు కదులుతున్నాయి. ఇవి గతంలో మనల్ని భయపెట్టిన మొంథా తుపాను కంటే రెట్టింపు శక్తితో ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల ఆసియా ప్రాంతంలో మేఘాలు భారీగా ఏర్పడుతున్నాయి. దీనివల్ల దక్షిణ భారత్లో మరికొన్ని రోజుల పాటు అకాల వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.