టెండర్ ఓట్ల కారణంగా.. తెలంగాణలో 3 బూత్ల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహబూబ్ నగర్, కామారెడ్డి, బోధన్లలో రీ పోలింగ్ జరగనుంది. ఈ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మూడు చోట్ల టెండర్ ఓట్లు పడ్డాయి. దీంతో ఆ మూడు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహబూబ్నగర్ లోని 41 వ వార్డులో.. 198 వ పోలింగ్ కేంద్రంతో పాటు.. కామారెడ్డిలోని 41 వ వార్డులో 101 బూత్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు.. EC ప్రకటించింది. వీటితో పాటు బోధన్లో 32వ వార్డు 87వ పోలింగ్ కేంద్రంలో కూడా రీ పోలింగ్ జరగనుంది. ఇటు టెండర్ ఓట్ల నమోదుకు కారణమైన వారిపై ఎన్నికల సిబ్బందిని సస్పెన్షన్ విధించింది. ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు ఒకటి రెండు ఓట్లు పెద్దగా తేడా చూపించవు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఒక వార్డులో గెలుపోటములును నిర్ణయించేది ఒకటి రెండు ఓట్లే కాబట్టి దానిపై ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉంది.
టెండర్ ఓట్ అనే విషయం తెరమీదకు రాగానే అందరూ దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు టెండర్ వోట్ అంటే ఏమిటి ఎవరు వేస్తారు? ఎందుకు వేస్తారు? అనే విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేసరికి తన ఓటు వేరేవాళ్లు వేసేసి ఉంటే అటువంటి ఓటరుకు టెండర్ ఓటు వేసే అవకాశం ఉంది. ఆ ఓటరు తన ఆధారాలను చూపితే పోలింగ్ అధికారి ప్రత్యేక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై ఓటు వేశాక ఒక కవరులో ఉంచి పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు. టెండర్ ఓటు వేసిన చోట అక్రమాలు జరిగాయని గుర్తించి రీపోలింగ్ నిర్వహిస్తారు.
తెలంగాణలో టెండర్ ఓటు పడిన మూడు చోట్ల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయ్..ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు... ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల మేయర్, ఛైర్మన్ పరోక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు.. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. అదే రోజు 12 గంటల 30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను పరోక్ష పద్దతిలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టారు.