మహబూబ్నగర్ ఆసుపత్రిలో ఎన్హెచ్ఆర్సీ విచారణ ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం మృతదేహాలను పరిశీలించి.. మూడు గంటల పాటు ఎన్కౌంటర్పై విచారణ చేసింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను ఎన్హెచ్ఆర్సీ రికార్డు చేసింది. అయితే, నిందితుల మృతదేహాలకు పోస్ట్మార్టం జరిగినప్పటికీ.. ఎన్హెచ్ఆర్సీ, హైకోర్టు విచారణ తరువాతే వీరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ విచారణ ఏం తేల్చబోతోంది..? హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
షాద్నగర్ చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్ స్పాట్ను జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. శనివారం రాత్రి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వచ్చిన ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు అణువణువూ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలికి వెళ్లారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం మొత్తాన్ని కాలినడకన తిరిగి పరిశీలించారు. దిశ మృతదేహాన్ని నిందితులు దహనం చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అంతకుముందు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించారు.
అలాగే, నిందితుల కుటుంబ సభ్యులతోనూ ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు మాట్లాడారు. సుమారు 3 గంటలకు పైగా మహబూబ్నగర్ ఆస్పత్రిలోనే ఉన్న ఎన్హెచ్ఆర్సీ సభ్యులు వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం చటాన్పల్లిలో దిశ ఘటన, నిందితుల ఎన్కౌంటర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
షాద్నగర్ ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరిపేందుకు ఢిల్లీ నుంచి ఓ టీమ్ను పంపించారు. శనివారం ఉదయం ఎన్హెచ్ఆర్సీ సభ్యులు విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్నగర్ ఆస్పత్రికి వచ్చారు.