కూకట్పల్లిలో వింత ఘటన: ఇంట్లో శవం.. 4 రోజులుగా ప్రార్థనలు.. పోలీసుల ఎంట్రీతో హైడ్రామా!
Kukatpalli Shocking Incident: నగరంలోని కూకట్పల్లిలో అత్యంత వింతైన, విస్మయానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది.
Kukatpalli Shocking Incident: నగరంలోని కూకట్పల్లిలో అత్యంత వింతైన, విస్మయానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. చనిపోయిన కుటుంబ సభ్యురాలికి అంత్యక్రియలు నిర్వహించకుండా, నాలుగు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని వింత ప్రార్థనలు చేస్తున్న ఒక కుటుంబం తీరు స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
ఏపీలోని ఏలూరుకు చెందిన ఏసురత్నం కుటుంబం 40 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చింది. ఏఎస్సైగా పనిచేసిన ఆయన పదేళ్ల క్రితం మరణించారు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, కుమారుడు జయరాజ్, ఇద్దరు కుమార్తెలు సునీత, శైలజ(46)లతో కలిసి కూకట్పల్లి రామకృష్ణానగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే, చిన్న కుమార్తె శైలజ అనారోగ్యంతో ఈ నెల 13న మృతి చెందింది.
శైలజ మరణించిన రోజే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, శవాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్ బాక్స్ను తెప్పించారు. అందులో మృతదేహాన్ని ఉంచి, తలుపులు బిగించుకుని లోపలే ఉంటున్నారు. అంత్యక్రియల ఊసే ఎత్తకుండా తమలో తాము ప్రార్థనలు చేసుకుంటూ కాలం గడిపారు.
ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. "మా ఇష్టం.. మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం, మీరెవరు అడగడానికి?" అంటూ గొడవకు దిగారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సైతం ఆ కుటుంబం చుక్కలు చూపించింది. ఎంతకీ తలుపులు తీయకుండా వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు గట్టిగా హెచ్చరించి, జీహెచ్ఎంసీ సాయంతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పడంతో వారు దిగివచ్చారు.
సదరు కుటుంబం ఎవరితోనూ కలవదని, వారి ప్రవర్తన వింతగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి మానసిక స్థితి కూడా సరిగా లేదని సమాచారం. పోలీసుల జోక్యంతో చివరకు శైలజ మృతదేహాన్ని వారి సొంతూరుకు తరలించారు.