బయో ఏషియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం!
BioAsia 2026: గ్లోబల్ లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్కేర్ రంగంలో హైదరాబాద్ తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది.
BioAsia 2026: గ్లోబల్ లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్కేర్ రంగంలో హైదరాబాద్ తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. నగరంలోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రారంభమైన ‘బయో ఏషియా 2026’ సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పెట్టుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యాలను వివరించారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేసిందని సీఎం తెలిపారు. గడిచిన రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఏకంగా 73 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం తెలంగాణ పారిశ్రామిక శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో హైదరాబాద్ ‘గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫాక్చరింగ్ హబ్’గా నిలుస్తోందని కొనియాడారు.
$3 ట్రిలియన్ల లక్ష్యం - 2047 విజన్:
దేశం 2047 నాటికి వికసిత భారత్ వైపు వెళ్తున్న తరుణంలో, తెలంగాణ కూడా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో ముందుకు వెళ్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రపంచస్థాయి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs)కు హైదరాబాద్ ఇప్పుడు కేరాఫ్ అడ్రస్గా మారిందని గుర్తుచేశారు.
హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి, వారికి పూర్తి భరోసా కల్పించారు. "హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి, ప్రతి పరిశ్రమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా వద్ద ప్రతిభావంతమైన మానవ వనరులు, ప్రముఖ విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు విజన్, పటిష్టమైన పాలసీలతో మేము ముందుకు సాగుతున్నాం." అని సీఎం స్పష్టం చేశారు.
రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్నాలజీ మరియు హెల్త్కేర్ రంగాలకు చెందిన దిగ్గజాలు పాల్గొని చర్చలు జరపనున్నారు.