Kyathanpally: క్యాతన్ పల్లిలో పరిస్థితి ఉద్రిక్తం.. మంత్రి వివేక్ కాన్వాయిపై రాళ్ల దాడి

Kyathanpally: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2026-02-17 06:35 GMT

Kyathanpally: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది.

మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు ఎంపీ వంశీకృష్ణల కార్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. గోబ్యాక్ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో మంత్రి వివేక్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ తోపులాట మరియు రాళ్ల దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ఓ కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకారులు భీభత్సం సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం క్యాతనపల్లిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రిపై దాడిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తుండగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు అతిగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Full View


Tags:    

Similar News