గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత మంచినీటి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బస్తీలతో పాటు అపార్ట్మెంట్లకూ ఈ పథకం వర్తించనుంది. ప్రతి కుటుంబానికీ 20వేల లీటర్ల తాగునీరు ఉచితంగా అందించనున్నారు. 20వేల లీటర్ల వినియోగం దాటితే అదనంగా వాడుకున్న నీటికి అమల్లో ఉన్న ఛార్జీలు వర్తించనున్నాయి. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకపోయినా ఉచితంగా నీరు అందించనున్నారు. మిగతా ఏరియాల్లో , అపార్ట్ మెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది.
ఈ సందర్భంగా ఇంటింటికి జీరో నీటి బిల్లులను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఈ పథకం వర్తించనుంది. ఈ పథకంతో జంట నగరాల్లో మొత్తం 10.08 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. గ్రేటర్లో 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఉచిత తాగునీటి పథకం ద్వారా లబ్దిదారులకు రూ. 19.92 కోట్లు ఆదా కానున్నాయి. మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు విధించారు.