కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ లెక్కలతో పాటు వివరించారు. మోడీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పన్నుల్లో వాటా తగ్గించడడం ప్రభుత్వ అసమర్థతే అని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీనియర్ అధికారులతో దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ సమీక్షించారు. కేంద్రం చేసిన కేటాయింపులు తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోత విధించిందని చెప్పారు సీఎం కేసీఆర్. నిధుల కేటాయింపుల విషయంలో తెలంగాణ పట్ల వివక్ష చూపించారని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమన్నారు. నిధుల కోత వల్ల రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందని చెప్పారు.
2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.3731కోట్లు తగ్గాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా తగ్గించడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతగా ఆయన అభివర్ణించారు. 2019-20లో ఏకంగా 18.9 శాతం నిధులు తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు. '' 2020-21 బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ రాష్ట్రానికి 2 రకాల నష్టం వాటిల్లింది. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గిస్తున్నారు'' అని కేసీఆర్ అన్నారు.
15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని కేసీఆర్ గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్రానికి రూ.2,381 కోట్ల నిధులు తగ్గనున్నట్లు చెప్పారు. కేంద్రం మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతోందన్నారు. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.