జూనియర్ డాక్టర్లపై దాడుల ఘటన హేయమైన చర్య అయినా కొన్నిసార్లు రోగుల బంధువులు దాడికి పాల్పడుతున్నారు. మంగళవారం వ్యక్తి చనిపోవడంపై బంధువులు జూనియర్ వైద్యునిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, తగు చర్యలు తీసుకోవాలంటూ జూడాలు ఆందోళనకు దిగారు.
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి ఉద్రిక్తంగా మారింది. రోగి బంధువులు దాడికి పాల్పడుతున్నారని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల ధర్నా కొనసాగుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతిచెందాడంటూ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ వైద్యుడిపై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేశారు.
ఈ ఘటనలో జూనియర్ డాక్టర్ ఒకరు స్పల్ఫంగా గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ నిన్న రాత్రి ఆస్పత్రి ముందు జూడాలు బైఠాయించారు. నిన్న రాత్రి నుంచి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు.ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జూనియర్ వైద్యుల బృందం ఇప్పటికే మంత్రి ఈటలను కలిశారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మరోవైపు జూనియర్ వైద్యులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. ఇక, జూనియర్ వైద్యుడిపై దాడికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.