Isnapur Municipal Election: ఇస్నాపూర్లో బిగ్ ట్విస్ట్: ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ.. మున్సిపల్ పీఠంపై కాషాయ-గులాబీ దోస్తీ?
Isnapur Municipal Election: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఊహించని ట్విస్ట్లు చోటుచేసుకున్నాయి.
Isnapur Municipal Election: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఊహించని ట్విస్ట్లు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వేసిన ఎత్తుగడలతో రాజకీయ సమీకరణలు నిమిష నిమిషానికి మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒకే కారులో ఎన్నికల కేంద్రానికి చేరుకోవడం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
కౌన్సిలర్ల జంపింగ్ల పర్వం:
చైర్మన్ ఎన్నికకు ముందు కౌన్సిలర్లు పార్టీలు మారుతుండటంతో బలాబలాలు తలకిందులవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ మమతతో పాటు ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డితో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.
బలాబలాలు - ఎక్స్ అఫిషియో ఓట్ల నిర్ణయం:
ప్రస్తుత సమీకరణల ప్రకారం బీఆర్ఎస్ బలం 14కు చేరగా, కాంగ్రెస్ బలం 12 వద్ద ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు ఎంపీ రఘునందన్ రావు తమ ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించుకోనున్నారు. వీరు ఇద్దరు కలిసి రావడం చూస్తుంటే, బీజేపీ ఎంపీ మద్దతుతో ఇస్నాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను చేర్చుకుని బలం పెంచుకున్నప్పటికీ, ఎక్స్ అఫిషియో ఓట్ల బలం బీఆర్ఎస్కే అనుకూలంగా ఉండటంతో ఇస్నాపూర్ ‘బాస్’ ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది.