Hyderabad: అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హబ‌్ గా భాగ్యనగరం

Hyderabad లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడుతో డేటా కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నాయి

Update: 2021-02-20 01:50 GMT

డేటా హబ్ గా హైదరాబాద్ (ఫైల్ ఫోటో)

Hyderabad: అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హబ్ గా భాగ్యనగరం మారుతోంది. ఇప్పటికే రూ. 20,000 కోట్ల భారీ పెట్టుబడితో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అమెజాన‌ వెబ్ సర్వీస్ సంస్థ ముందుకు వచ్చింది. దీనితో పాటు మరో నాలుగు అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడుతో డేటా కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సంస్థలు నిర్మించేందుకు మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై ఐటీశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ సంస్థలు అన్ని అనుమతులతో కార్యకలాపాలు ప్రారంభిస్తే హార్డ్ వేర్, ఐటీ రంగాల పరిశ్రమలకు మరింత మేలుతో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.

ముంబయి, చెన్నై, దిల్లీ నగరాలతో పోల్చితే ఇక్కడ భూముల లభ్యత ఎక్కువ. ధరలు కాస్త తక్కువ కూడా. నగరంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రత్యేక డేటాసెంటర్లు ఉన్నాయి.

అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సంస్థలతో హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు కేంద్రస్థానంగా మారింది. ప్రైవేట్‌ ఐటీ సంస్థలకు సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు వరస కడుతున్నాయి. జాతీయస్థాయిలో దేశాన్ని డేటాసెంటర్ల కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురానుంది.

కంట్రోల్‌ఎస్‌ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థలో 2,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ముంబయితో పాటు హైదరాబాద్‌లో 2 మిలియన్ల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటైన డేటా సెంటర్లను మరింత విస్తరించడానికి ఆ సంస్థ ఐటీశాఖకు ప్రతిపాదనలు సమర్పించింది.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ర్యాక్‌బ్యాంక్‌ సంస్థ ముందుకు వచ్చింది.

డేటా సెంటర్లు ఏర్పాటైతే మరిన్ని అంతర్జాతీయ సంస్థలు తదుపరి కార్యాలయాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు అవకాశాలు ఉండాలని భావిస్తోంది. ఈ సెంటర్ల ఏర్పాటుతో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. వాటికి అనుబంధంగా హార్డ్‌వేర్‌, అనుబంధ రంగాల పరిశ్రమలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, అమెజాన్‌, గూగుల్‌ తదితర సంస్థలకు హైదరాబాద్‌ బ్యాక్‌ ఆఫీసుగా ఉంది.

డేటాసెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ వాతావరణ, మానవ వనరుల పరంగా ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందని నాస్కామ్‌ పేర్కొంది. అంతర్జాతీయ డేటాసెంటర్ల పెట్టుబడులు మరిన్ని ఆకర్షించేందుకు నెట్‌వర్క్‌ కనెక్టివిటీ పెంచుకోవాల్సిన అవసరముందని సూచించింది.

Tags:    

Similar News