Weather Report: తెలంగాణలో నిప్పుల వర్షం కురిపిస్తోన్న భానుడు
Weather Report: భగభగ మండే ఎండలతో పిట్టల్లా రాలుతున్న జనాలు
Weather Report: తెలంగాణలో సూరీడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భగ భగ మండే ఎండలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తీవ్రమైన ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకంటే ఎక్కువే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, తూర్పు జిల్లాల్లో మాత్రం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న నాలుగైదు రోజుల్లో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మ,, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట తదితర జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేశారు. ఎల్లుండి వరకూ వేసవి తీవ్రత మరింత పెరుగుతుందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో గురువారం నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడికి తాళలేక నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు.
మెదక్, ఆసిఫాబాద్, కరీంనగర్, హన్మకొండ జిల్లాలో ఒక్కొకరు చొప్పను వడదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక మే 6తర్వాత తెలంగాణలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. వీకెండ్ వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. వాతావరణ మార్పులతోనే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలులో వీస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.