Chiranjeevi: చిరంజీవిని కలిసిన మంత్రి కొండా సురేఖ.. మాజీ కేంద్ర మంత్రి అంటూ ట్వీట్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
Chiranjeevi: చిరంజీవిని కలిసిన మంత్రి కొండా సురేఖ.. మాజీ కేంద్ర మంత్రి అంటూ ట్వీట్
హైదరాబాద్లో మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ, ఆయనకు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ భేటీకి ఆమె కుమార్తె కొండా సుస్మిత కూడా హాజరయ్యారు.
ఈ సమావేశానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చిరంజీవిని ఎందుకు కలిశారన్న విషయంపై మంత్రి కొండా సురేఖ స్పష్టత ఇవ్వలేదు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, చిరంజీవిని “కేంద్ర మాజీ మంత్రి”గా పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు పలుమార్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ చిరంజీవిని కలవడం వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వచ్చే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు ఈ భేటీపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రామ్చరణ్–ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తే, చిరంజీవి కుమార్తె సుస్మితకు అభిమాన నటుడని, ఆ కారణంగానే ఈ భేటీ జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.