Jeevan Reddy: నాపై కోపం ఉంటే నా మీద చర్య తీసుకోండి.. కార్యకర్తలను బలి చేయొద్దు
Jeevan Reddy: మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు జగిత్యాల కాంగ్రెస్లో చిచ్చు రేపింది.
Jeevan Reddy: మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు జగిత్యాల కాంగ్రెస్లో చిచ్చు రేపింది. పార్టీ జెండా మోసిన అసలైన కార్యకర్తలకు కాకుండా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనుషులకే బీ-ఫారమ్లు ఇచ్చారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు జరిగిన అన్యాయంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను విస్మరించారని, ఇది వారి గొంతు కోయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
"నాపై ఏమైనా కోపం ఉంటే నా మీద చర్యలు తీసుకోండి.. కానీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం చేయకండి" అని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులకే కాంగ్రెస్ బీ-ఫారమ్లు కట్టబెట్టారని, దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు రాహుల్ గాంధీ 'జై సంవిధాన్' (రాజ్యాంగాన్ని గౌరవించండి) అని నినాదిస్తుంటే, క్షేత్రస్థాయిలో ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే ఆ నినాదానికి అర్థం ఏముందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.