పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
కరోనా వ్యాప్తి లాక్డౌన్ వల్ల సొంత జిల్లాలకు వెళ్లలేక పోయిన రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు అదే జిల్లాలో పరిక్షలు రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాప్తి లాక్డౌన్ వల్ల సొంత జిల్లాలకు వెళ్లలేక పోయిన రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు అదే జిల్లాలో పరిక్షలు రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థుల వివరాలను సేకరించి పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డీఈఓలను ఆదేశించింది. ఇబ్బందులు ఉన్న విద్యార్థులు తమకు సమాచారం ఇవ్వాలని శుక్రవారమే డీఈఓలు ఫోన్ నంబర్లను ప్రకటించారు.
అయితే దీనివల్ల కొన్నిచోట్ల సమస్యలు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతానికి చెందిన విద్యార్థి హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇప్పుడు ఆ విద్యార్థి ఉన్న ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రాలు లేకుంటే ఎలా అనే సందేహం తలెత్తుతోంది.
పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో.. విద్యార్థుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్సులను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయటంతోపాటు విద్యార్థులకు కూడా శానిటైజర్ను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకుండా ఆగస్టు, సెప్టెంబరుల్లో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతే ఆ విద్యార్థులను రెగ్యులర్గా పరిగణిస్తారో లేదో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సప్లిమెంటరీ పరీక్షలను రెగ్యులర్గా గుర్తించడంపై వివరణ తీసుకుని చెబుతాననడంతో ధర్మాసనం విచారణను శనివారానికి వాయిదా వేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనవారిని రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించినందున దీనిపై అధికారులు చర్చిస్తున్నారు. శనివారం హైకోర్టులో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనున్నారు.