Revanth Reddy: ప్రజలను వేధించే అధికారులకు సీఎం హెచ్చరిక
Revanth Reddy: ప్రజలను వేధిస్తే వేటు వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజలను వేధించే అధికారులకు సీఎం హెచ్చరిక
Revanth Reddy: ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని ఎవరు చెప్పారని సీఎం ఆరా తీశారు. తనిఖీ చేయాలని సూచించిందెవరని సమీక్షలో ఉన్న ట్రాన్స్ కో సీఎండీ రిజ్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సమావేశంలోనే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి.... ఈ అంశం తన దృష్టికి సైతం వచ్చిందన్నారు.
శాఖాపరమైన నిర్ణయం లేకుండానే డిస్కం డైరెక్టర్ స్వతహాగా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని విధుల నుంచి తొలగించినట్లు.... మరో అధికారిని బదిలీ చేసినట్లు వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.