మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థులపై దాడి
మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో చదువుకుంటున్న విద్యార్థులపై ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేశారు.
మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో చదువుకుంటున్న విద్యార్థులపై ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేశారు. ఈ దాడిలో మల్లికార్జున్ రెడ్డి అనే ఇంజనీరింగ్ విద్యార్థికి ముక్కు, తలపై తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం మెడికేర్ హాస్పిటల్కి తరలించారు. యమ్నంపేటలో మల్లికార్జున్ రెడ్డి ఇద్దరు మిత్రులతో కలిసి అద్దెకుంటూ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్నారు. అదే కాలనీల్లో ఉంటున్న సాయి కుమార్ రెడ్డి, నాని ఇద్దరు మద్యం సేవిస్తూ, లౌడ్ స్పీకర్లు పెట్టి డాన్స్ లు చేస్తూ చుట్టూ పక్కల వాళ్లను ఇబ్బంది కలిగే విధంగా పార్టీ చేస్తున్నారు. అర్దరాత్రి కూడా సౌండ్ వస్తుంటే చదువుకుంటున్న విద్యార్దులు కిటికీ డోర్ తీసి చూసినందుకు మా వైపు చూస్తావ అని గోడ దూకి వచ్చి స్టూడెంట్స్ని కొట్టి తీవ్రంగా గాయపర్చారు. అడ్డొచ్చిన ఇంటి ఓనర్ను కూడా కొట్టి, మీ అంతు చూస్తామని భయబ్రాంతులకు గురి చేశారు.
తీవ్రగాయపడిన మల్లికార్జున్ రెడ్డి కోలుకోవడానికి సుమారు 6నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు పరార్లో ఉన్నారు. పోలీసులు వారిని త్వరగా పట్టుకొని శిక్షించాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నారు. ఇంటి ఓనర్ మాకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.