తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ చివరి రోజుల చేసిన ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలను చేసారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చివరి రోజున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కేంద్రంలోని చాయ్వాలానే వదలలేదు.. మమ్మల్ని విమర్శిస్తే కారు టైర్లు ఊడిపోతాయ్' అంటూ తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ను హెచ్చరించారు. సీఏఏ అమలుతో ముస్లింలకే కాకుండా హిందువులు, సిక్కులు, క్రైస్తవులకూ ఇబ్బందులు తప్పవని తెలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తాము మొదటి నుంచి పోరాటం చేస్తూన్నామని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు.
ఎంఐఎం కేవలం ముస్లింల పార్టీ మాత్రమే కాదని, అన్ని వర్గాల కోసం తమ పార్టీ ఆవిర్భవించి పనిచుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, ఈ ఎన్నికల్లో ఓడించి తీరతామని ఆయన అన్నారు. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంఐఎంను పాతబస్తీ పార్టీ అంటూ విమర్శించారని తెలిపారు. అన్ని మాటలు మాట్లాడిన ఆయన సికింద్రాబాద్ నుంచి తన కొడుకును గెలిపించుకోలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని అన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చివరి రోజు కావడంతో వాడీవేడీగా జరిగాయి. ఇక ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో వేచి చూడాల్సిందే.