తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కసరత్తులు!
తెలంగాణ లో కొత్తగా ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ లో ఒకేఒక్క విమానాశ్రయం ఉంది. అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం. తెలంగాణ నుంచి ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాల్సిందే. దేశీయ ప్రయాణాలకూ అక్కడివరకూ వెళ్ళాల్సిందే. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏర్పాతుకాక ముందు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ ఉండేది. ప్రస్తుతం దానిని కమర్షియల్ విమానాలకు అనుమతి లేదు. దీంతో తెలంగాణ కు ఒక్కటే ఎయిర్ పోర్ట్ ఉన్నట్టైంది.
ప్రయాణీకులకు ఇది ఇబ్బందిగానే ఉంది. తెలంగాణ లో ఎక్కడి వారైనా శంషాబాద్ వరకూ రోడ్డు మార్గంలో వచ్చి విమానం ఎక్కాల్సిన పరిస్థితి. దాంతో ఎక్కడెక్కడి నుంచో అత్యంత వేగంగా శంషాబాద్ వరకూ చేరినా తమ స్వస్తాలలకు వెళ్ళడానికి చాలా సమయం పడుతోంది. ఈ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం కిందే గుర్తించింది. దానికి పరిష్కార మార్గాలను అన్వేషించింది. ఈ క్రమంలో తెలంగాణ లో వివిధ ప్రాంతాల్లో ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు ఉండాల్సిన అర్హతలు, ఇతర సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతోంది.
ఈ ఆలోచన అమలు దిశగా ఇప్పుడు కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపాదించిన 6 విమానాశ్రయాలపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఏరియల్ సర్వే నిర్వహించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఈ సర్వే త్వరలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక బృందాల ద్వారా ఈ సర్వేను నిర్వహించనుంది.
ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాలు ఇవే!
ప్రయాణికుల సౌలభ్యం, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తెలంగాణలో ఆరు ప్రాంతాలను గుర్తించారు. అవి.. నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జిల్లాల్లోనూ నిజామాబాద్లోని జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లాలోని అద్దకల్, భద్రాద్రి కొత్తగూడెం వద్ద, వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ నగర శివారు, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా భూసేకరణ కూడా చేశారు. నిజానికి బసంత్నగర్, మామునూరు, ఆదిలాబాద్, నిజామాబాద్లలో చాలా దశాబ్దాల క్రితం విమానాశ్రయాల నిర్వహణ జరిగింది. నిజామాబాద్ నగరంలో గతంలో విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు జక్రాన్ పల్లిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
రైట్ అనే సంస్థ సర్వే జరిపి నివేదికలను ప్రభుత్వానికి ఇప్పటికే అందచేసింది. ఆ వివరాలను ప్రభుత్వం గతంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపించింది. అందించగా, ప్రతిపాదనలను ఏఏఐకి పంపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల అనుమతుల కోసం ఇప్పుడు జాతీయ విమానాశ్రయాల సంస్థ ఏరియల్ సర్వేను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తారు. ఇందుకోసం హెలికాప్టర్లలో నిపుణులు పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. రిమోట్ సెన్సింగ్ జీఐఎస్ మ్యాపింగ్, నియంత్రణ వంటి సమాచారాన్ని సేకరిస్తారు. నేల స్వభావాన్ని కూడా అంచనా వేస్తారు. రన్వేలు, ఏటీసీకి అనుకూలతలు, ప్రతిపాదిత విమానాశ్రయ స్థలానికి చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.