T20 World Cup 2026 IND vs WI: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ కి భారత్
T20 World Cup 2026 IND vs WI: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ కి భారత్ చేరుకుంది
T20 WC 2026 Super 8 IND vs WI
T20 World Cup 2026 IND vs WI: టీ20 ప్రపంచ కప్లో భారత్ సెమీఫైనల్స్లో చోటు దక్కించుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడనుంది. చివరి సూపర్ 8 మ్యాచ్లో, భారత్ వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు సామ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (40), జాసన్ హోల్డర్ (37 నాటౌట్) కీలక పాత్ర పోషించగా, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో మొదట్లోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. త్వర త్వరగా రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో 10 పరుగులు చేసి అవుటయ్యారు. అయితే, సంజు సామ్సన్ ఒక ఎండ్లో గట్టిగా నిలిచి, సూర్యకుమార్ యాదవ్తో కలిసి 35 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
ఆ తర్వాత అతను తిలక్ వర్మతో 42, హార్దిక్ పాండ్యాతో 38, శివం దుబేతో అజేయంగా 20 పరుగుల భాగస్వామ్యాలను పంచుకున్నాడు. దీంతో భారత్ విజయానికి మార్గం సుగమం అయింది.
టీమిండియా ఈ విజయం వెనుక సూత్రధారి నిస్సందేహంగా సంజు సామ్సన్. ఓపెనర్గా మైదానంలోకి వచ్చిన సంజు జట్టు కోసం ఒంటి చేత్తో పోరాడాడు. సంజు చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో.. వెస్టిండీస్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత టీం ఇండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.
వెస్టిండీస్ కు శుభారంభం..
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు మంచి ప్రారంభం దొరికింది. షాయ్ హోప్- చేజ్ తొలి వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత ఫీల్డర్లు కూడా వెస్టిండీస్ స్కోరుకు చాలా సహకరించారు. వరుణ్ చక్రవర్తి రనౌట్ ను మిస్ చేస్తే, అభిషేక్ శర్మ సులభమైన క్యాచ్ ను నేలపాలు చేశాడు. దీనిని సద్వినియోగం చేసుకుని, వికెట్లు పడిపోయినప్పటికీ వెస్టిండీస్ భారత బౌలర్లపై దాడి చేసింది.
చివరి 10 ఓవర్లలో 113 పరుగులు
అయితే, తొలి 10 ఓవర్లలో భారత్ బాగా బౌలింగ్ చేసి 82 పరుగులు మాత్రమే ఇచ్చింది. కానీ చివరి 10 ఓవర్లలో విండీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది. విండీస్ తరఫున రోస్టన్ చేజ్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు, పావెల్, జాసన్ హోల్డర్ వరుసగా 34 - 37 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ ఐదవ వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా, విండీస్ 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారత్ కు తొలి షాక్..
ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే చరిత్ర సృష్టించాల్సిందే. ఎందుకంటే, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇంత పెద్ద స్కోరును ఎప్పుడూ ఛేదించలేదు. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు మంచి ఆరంభం లభించలేదు. మళ్ళీ ఓపెనర్ అభిషేక్ శర్మ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. అభిషేక్ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా బ్యాటింగ్లో బాగా రాణించలేకపోయాడు. అతను కూడా కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఒక ఎండ్లో వికెట్లు పడినప్పుడు, మరొక ఎండ్లో నిలిచిన సంజు సామ్సన్ కీలకమైన మ్యాచ్లో తన అనుభవాన్నంతా ఉపయోగించి నిలబడ్డాడు.
సంజు కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్..
ఓపెనర్గా వచ్చి చివరి వరకు నాటౌట్గా నిలిచిన సంజు సామ్సన్, జట్టును విజయపథంలో నడిపించిన తర్వాత డగౌట్లోకి తిరిగి వచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో, సంజు సామ్సన్ 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేశాడు. 104 స్ట్రైక్ రేట్తో ఆడిన ఈ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. T20 ప్రపంచ కప్ పరుగుల వేటలో ఏ భారతీయ బ్యాట్స్మన్ కూడా ఇంత స్కోరు చేయలేదు. గతంలో, ఈ రికార్డు 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ పేరిట ఉంది. సంజుతో పాటు, తిలక్ వర్మ కూడా ఈ మ్యాచ్లో 27 పరుగులు అందించాడు. చివరికి, శివం దుబే కూడా అజేయంగా 8 పరుగులు సాధించాడు. దీంతో భారత్ విజయం సాధించి సెమీస్ చేరుకుంది.