Pakistan Cricket: పీసీబీ సంచనల నిర్ణయం.. పాకిస్థాన్ జట్టులో ప్రక్షాళన, స్టార్ ప్లేయర్స్ కెరీర్ ముగిసినట్లే!
Pakistan Cricket: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Pakistan Cricket: పీసీబీ సంచనల నిర్ణయం.. పాకిస్థాన్ జట్టులో ప్రక్షాళన, స్టార్ ప్లేయర్స్ కెరీర్ ముగిసినట్లే!
Pakistan Cricket: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 సూపర్-8 మ్యాచ్లో భాగంగా శనివారం పల్లెకలెలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాక్ 5 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా పాక్ 8 వికెట్లకు 212 పరుగులు చేసింది. సెమీస్ చేరాలంటే.. ఛేదనలో లంకను 147 స్కోరు లోపు కట్టడి చేయాల్సి ఉండే. కానీ లంకేయులు అద్భుతంగా ఆడి 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. దాంతో పాక్ రన్రేట్ (-0.123) కంటే న్యూజిలాండ్ రన్రేట్ (1.390) ఎక్కువగా ఉండడంతో .. కివీస్ సెమీ ఫైనల్ బెర్తు దక్కించుకుంది. ఇక పాక్ నిష్క్రమణపై ఆ దేశ మాజీలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచనల నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు చేపడుతోందని తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన నేపథ్యంలో కెప్టెన్సీ మార్పుపై చర్చలు వేడెక్కాయి. ప్రస్తుత టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జట్టు ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్న పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈసారి వరల్డ్ కప్లో మంచి ఫలితాలు వస్తాయని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ హామీ ఇచ్చినా.. ఫలితం రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ కెప్టెన్సీ రేసులో ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆల్రౌండర్ షాబాద్ ఖాన్, స్టార్ పేసర్ షహీన్ ఆఫ్రిదిలు రేసులో ఉన్నట్లు సమాచారం. ఇద్దరికీ అంతర్జాతీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు ఉండటంతో బోర్డు వీరిలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కొందరు సీనియర్ ప్లేయర్ల భవిష్యత్తుపై కూడా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా బాబర్ ఆజామ్, ఉస్మాన్ ఖాన్, సైమ్ ఆయూబ్ వంటి ఆటగాళ్ల టీ20 కెరీర్పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టు భవిష్యత్ ప్రణాళికలపై హెడ్ కోచ్ మైక్ హెసెన్, సెలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే.. పాకిస్థాన్ టీ20 జట్టులో పెద్ద ఎత్తున మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కెప్టెన్సీ మార్పు నుంచి ప్లేయర్ రీప్లేస్మెంట్స్ వరకు పలు కీలక నిర్ణయాలు త్వరలో వెలువడే అవకాశముండటంతో.. పాక్ క్రికెట్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభిమానులు కూడా కొత్త నాయకత్వంతో జట్టు తిరిగి ఫామ్లోకి వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. అయితే మెగా టోర్నీలలో పాక్ విఫలమైనప్పుడల్లా.. ఇలా ప్రక్షాళన జరగడం సాధారణం అయింది.