భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన బలహీనతను మరోసారి దాటలేకపోయింది. ఫైనల్స్ వరకు అద్భుత పోరాటం చేసే సింధు.. ఫైనల్ మ్యాచ్ లో తడబాటుకు గురవుతుండటం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈసారీ అదే జరిగింది. సీజన్ తొలి టోర్నీలో టైటిల్ గెలిచి ఫాం లోకి రావాలనుకున్న సింధు ఆశలు ఆవిరి అయిపోయాయి.
ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి(జపాన్) 51 నిమిషాల్లో 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుపై అలవోక విజయం సాధించింది. ప్రారంభంలో సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. తేరుకున్న యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో యమగూచి ,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది.