Womens World Cup 2025: హిస్టరీ క్రియేట్ చేసిన భారత మహిళల టీమ్.. దక్షిణాఫ్రికాపై విజయంతో తొలి ప్రపంచ కప్ టైటిల్
Womens World Cup 2025: భారత ఆడబిడ్డలు 150 కోట్ల మంది భారతీయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనిని చేసి చూపించారు.
Womens World Cup 2025: హిస్టరీ క్రియేట్ చేసిన భారత మహిళల టీమ్.. దక్షిణాఫ్రికాపై విజయంతో తొలి ప్రపంచ కప్ టైటిల్
Womens World Cup 2025: భారత ఆడబిడ్డలు 150 కోట్ల మంది భారతీయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనిని చేసి చూపించారు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ మహిళల ప్రపంచ కప్ను గెలుచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 298 పరుగులు చేయగా, దానికి సమాధానంగా దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలింగ్, ఫైనల్ ఒత్తిడిలో కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టు కేవలం 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ సెంచరీ బాదినప్పటికీ, ఆమె ఔట్ కాగానే మ్యాచ్ మొత్తం మారిపోయింది.
భారత్ విజయానికి షెఫాలీ వర్మ, దీప్తి శర్మ మార్గం వేశారు. ఫైనల్ మ్యాచ్లో షెఫాలీ 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసింది. అదేవిధంగా, దీప్తి కూడా 58 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు పడగొట్టింది. ఒక ప్లేయర్ ను రనౌట్ కూడా చేసింది. భారత జట్టు ఈ మ్యాచ్లోనూ టాస్ ఓడిపోయింది. అది వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరు బ్యాట్స్మెన్ తొలి వికెట్కు 104 పరుగులు జోడించారు. స్మృతి మంధాన 45 పరుగుల వద్ద ఔటైనప్పటికీ, షెఫాలీ వర్మ క్రీజ్లో నిలబడి 87 పరుగులు చేసి భారత్ను మంచి స్థితికి చేర్చింది. షెఫాలీతో పాటు మిడిల్ ఆర్డర్లో దీప్తి శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ 100 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా 24 బంతుల్లో 34 పరుగులు చేసి, టీమిండియా 298 పరుగులకు చేరుకుంది.
బ్యాట్స్మెన్ల తర్వాత బౌలర్ల వంతు వచ్చింది. అందరు బౌలర్లు తమ సత్తాను నిరూపించుకున్నారు. ముఖ్యంగా దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, శ్రీ చరణి తమ స్పిన్తో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టారు. దీప్తి శర్మ 9.3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి 48 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. షెఫాలీ వర్మ 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈ టోర్నమెంట్కు ముందు ఆమె 12 ఐసీసీ టోర్నమెంట్లలో ఆడింది. ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురైంది. ఆమె వన్డే ప్రపంచ కప్ 2009, 2013, 2017, 2022 లలో ఆడింది. టీ20 ప్రపంచ కప్ ఆమె 2009, 2010, 2012, 2014, 2016, 2018, 2020, 2023 లలో ఆడింది కానీ ఆమె విఫలమైంది. ఇప్పుడు చివరికి ఆమె 2025లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి గౌరవాన్ని దక్కించుకుంది.