IND vs PAK : 15 ఫిబ్రవరి, మహాశివరాత్రి.. 2003, 2015 చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న పాక్ మ్యాచ్
15 ఫిబ్రవరి, మహాశివరాత్రి.. 2003, 2015 చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న పాక్ మ్యాచ్
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా పాకిస్థాన్ను మట్టికరిపించింది. 61 పరుగుల భారీ తేడాతో పాక్ను ఓడించి సూర్యకుమార్ యాదవ్ సేన సూపర్-8లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయితే, ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులను ఒక వింత సెంటిమెంట్ ఇప్పుడు భయపెడుతోంది. పాకిస్థాన్పై గెలిచిన ప్రతిసారీ సంబరాలు చేసుకుంటాం కానీ, ఈసారి వచ్చిన గెలుపు వెనుక ఒక బ్యాడ్ లక్ దాగి ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను విశ్లేషిస్తే, పాక్పై ఈ తరహా విజయాలు లభించినప్పుడల్లా భారత్ వరల్డ్ కప్ ట్రోఫీని చేజార్చుకుంది. మరి ఈ సారైనా ఆ సెంటిమెంట్ను బద్దలు కొట్టి భారత్ కప్పు గెలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఏమిటా 15 ఫిబ్రవరి సెంటిమెంట్?
భారత్, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 15వ తేదీన వరల్డ్ కప్ మ్యాచ్లో తలపడటం ఇది రెండోసారి. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, అంటే 2015 వన్డే వరల్డ్ కప్లో కూడా ఇదే తేదీన భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ధోనీ నాయకత్వంలోని టీమిండియా పాకిస్థాన్ను ఓడించి ఘనవిజయం సాధించింది. కానీ ఆ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫిబ్రవరి 15వ తేదీన పాక్ను చిత్తు చేసిన టీమిండియాకు, ఆనాటి ఫలితమే రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కేవలం తేదీ మాత్రమే కాదు, ఈసారి మరో వింత యాదృచ్చికం కూడా తోడైంది.
మహాశివరాత్రి, 2003 వరల్డ్ కప్ లింక్
ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగడంతో పాటు, అదే రోజు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నాం. భక్తులంతా శివనామ స్మరణలో ఉండగా భారత్ విజయం సాధించి మంచి గిఫ్ట్ ఇచ్చింది. అయితే, ఇక్కడే ఒక చేదు జ్ఞాపకం దాగి ఉంది. 23 ఏళ్ల క్రితం అంటే 2003 వరల్డ్ కప్లో కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మహాశివరాత్రి రోజే జరిగింది. ఆ మ్యాచ్లో గంగూలీ నేతృత్వంలోని భారత్ అద్భుతంగా ఆడి పాక్ను ఓడించింది. కానీ, ఆ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన భారత్, ఆఖరి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా మిగిలిపోయింది. అంటే శివరాత్రి రోజు పాక్ను ఓడించినా ట్రోఫీ మాత్రం దక్కలేదు.
అప్పట్లో ఆసీస్.. ఇప్పుడు ఎవరు?
2003లో అయినా, 2015లో అయినా భారత్ను ట్రోఫీకి దూరం చేసింది ఆస్ట్రేలియా జట్టు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా అత్యంత బలంగా కనిపిస్తోంది. ఒకవైపు 15 ఫిబ్రవరి సెంటిమెంట్, మరోవైపు మహాశివరాత్రి సెంటిమెంట్.. ఈ రెండు కలిసినప్పుడు భారత్ ట్రోఫీ గెలవలేకపోయిందనేది గణాంకాలు చెబుతున్న వాస్తవం. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా అజేయంగా కనిపిస్తున్నా, ఈ వింతైన కాంబినేషన్ అభిమానులను కలవరపెడుతోంది. చరిత్ర రిపీట్ అవుతుందా లేక స్కై సేన కొత్త చరిత్ర రాస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
చరిత్రను తిరగరాసే సత్తా సూర్య సేనకు ఉందా?
సెంటిమెంట్లు పక్కన పెడితే, ప్రస్తుత భారత జట్టు ఫామ్ చూస్తుంటే ఏ జట్టునైనా ఓడించేలా ఉంది. అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్ మెరుపులు.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ మార్కు ఇవన్నీ భారత్ను ఫేవరెట్గా నిలబెడుతున్నాయి. గతంలో జరగనిది ఈసారి జరగకూడదని ఏమీ లేదు. 2007లో కొత్త కెప్టెన్ ధోనీ ఎలాగైతే చరిత్ర సృష్టించాడో, ఇప్పుడు సూర్య కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. పాకిస్థాన్పై వచ్చిన ఈ 61 పరుగుల భారీ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ఊపు సూపర్-8లో కూడా కొనసాగితే, పాత సెంటిమెంట్లన్నీ పటాపంచలు కావడం ఖాయం. ఆస్ట్రేలియా భయాన్ని వీడి, పాత రికార్డులను చెరిపివేసి భారత్ మళ్ళీ వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని కోట్లాది మంది ఆశిస్తున్నారు.