DC vs MI 2026: ముంబై, ఢిల్లీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. 'ఆ నలుగురు' దక్షిణాఫ్రికా ప్లేయర్లే!

A rare moment in IPL 2026: ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం (ఏప్రిల్ 4) ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

Update: 2026-04-04 15:16 GMT

DC vs MI 2026: ముంబై, ఢిల్లీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. 'ఆ నలుగురు' దక్షిణాఫ్రికా ప్లేయర్లే!

DC vs MI 2026: ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల కారణంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడే అవకాశం వస్తోంది. ఒకే జట్టులో 2, 3 అంతర్జాతీయ ప్లేయర్స్ ఒకే జట్టుకు ఆడుతున్నారు. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ సంఖ్య ఎక్కువగా కూడా ఉంటుంది. దీంతో అరుదైన, ఆసక్తికర సంఘటనలు లేదా దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఐపీఎల్ 2026లో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం (ఏప్రిల్ 4) ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 163 పరుగుల లక్షాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదిస్తోంది. 16.4వ ఓవర్ సమయంలో మైదానంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. స్ట్రయికర్‌గా డేవిడ్ మిల్లర్, నాన్‌ స్ట్రయికర్‌గా ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఉండగా.. బౌలింగ్ చేసింది కార్బిన్‌ బాష్‌. అదే సమయంలో వికెట్ కీపర్‌గా ర్యాన్‌ రికెల్టన్‌ ఉన్నాడు. ఒకేసారి నాలుగు కీలక స్థానాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాళ్లే ఉండటం విశేషంగా నిలిచింది. క్రికెట్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన నలుగురు ఆటగాళ్లు ఇలా స్ట్రయికర్, నాన్‌ స్ట్రయికర్, బౌలర్, వికెట్ కీపర్‌గా ఒకేసారి ఉండటం చాలా అరుదైన విషయం. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన నమోదు కాలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా కనిపించే ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2026లో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కార్బిన్‌ బాష్‌, ర్యాన్‌ రికెల్టన్‌ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సునాయాస విజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (51) హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్‌ శర్మ 35, నమన్‌ 28 రన్స్ చేశారు. ఢిల్లీ పేసర్ ముఖేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వి (90) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నిశాంక 44 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, మిచెల్ శాంట్నర్‌, బాష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Tags:    

Similar News