ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి నామినేషన్ దాఖలు
Justice B Sudershan Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ప్రకటించింది.
Justice B Sudershan Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్రెడ్డి పేరును ప్రకటించింది. ఆయన ఢిల్లీలో రిటర్నింగ్ అధికారికి అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఎన్నో ప్రతిపక్ష పార్టీల ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ నేత రామ్గోపాల్ యాదవ్, డీఎంకే ప్రతినిధి తిరుచ్చి శివ, టీఎంసీ నేత శతాబ్ది రాయ్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటాస్ హాజరయ్యారు.
మొత్తం 160 మంది ఎంపీలు జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతుగా సంతకాలు చేసినట్లు సమాచారం. రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ పత్రాలను పరిశీలించి రశీదును అందజేశారు.
మీడియాతో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ .. “రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల గాఢమైన నిబద్ధతతోనే నేను ఈ నామినేషన్ దాఖలు చేశాను. భారత ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తి గౌరవంపైనే ఆధారపడి ఉంటుంది” అని అన్నారు.
ఇక అధికార ఎన్డీయే కూటమి తరఫున సీపీ రాధాకృష్ణన్ ఆగస్టు 20న తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఎన్నికల సమీకరణ
ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.
మొత్తం ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య 781.
గెలుపు కోసం కావాల్సిన మెజార్టీ మార్కు 391.
అధికార పక్షానికి ఇప్పటికే 422 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు అంచనా.
ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్షం న్యాయమూర్తి సుదర్శన్రెడ్డిని బరిలోకి దింపగా, అధికార పక్షం నుంచి సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు.