Bhopal Court Tension: అత్యాచార నిందితుడికి కోర్టులోనే దేహశుద్ధి.. భోపాల్‌లో న్యాయవాదుల ఆగ్రహం!

Bhopal Court Tension: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణం మంగళవారం యుద్ధభూమిని తలపించింది.

Update: 2026-02-03 10:42 GMT

Bhopal Court Tension: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణం మంగళవారం యుద్ధభూమిని తలపించింది. మైనర్ బాలికపై అత్యాచారం, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన నిందితుడిపై న్యాయవాదులు, ఆగ్రహంతో ఉన్న ప్రజలు మూకుమ్మడి దాడికి దిగారు. పోలీసుల రక్షణ వలయాన్ని ఛేదించుకుని నిందితుడిని చితకబాదడంతో కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అసలేం జరిగిందంటే?

కోహెఫిజా ప్రాంతానికి చెందిన 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలపై ఒసాఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న న్యాయవాదులు నిందితుడిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయారు.

పోలీసులు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, న్యాయవాదులు అతడిని చుట్టుముట్టి దాడి చేశారు. పోలీసులకు, న్యాయవాదులకు మధ్య జరిగిన ఈ తోపులాటతో కోర్టు కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు అతడిని అతికష్టమ్మీద కోర్టు లోపలికి తరలించారు.

కేసు వివరాలు.. షాకింగ్ నిజాలు!

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గతేడాది జూలైలో నిందితుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రహస్యంగా వీడియో తీసి, దానిని అడ్డం పెట్టుకుని రూ. లక్ష డిమాండ్ చేశాడు. భయపడిన బాధితురాలు ఇప్పటివరకు రూ. 40,000 చెల్లించింది. అంతేకాకుండా, బాధితురాలిని బలవంతంగా ఇస్లామిక్ ప్రార్థనలు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.

ప్రస్తుతం పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విచారణకు పంపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News