Rajasthan: 'కిలాడీ' భార్య కిరాతకం.. ప్రియుడితో కలిసి భర్త హత్య! హిట్ అండ్ రన్ డ్రామా బట్టబయలు
Rajasthan: రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జనవరి 30న జరిగిన 'హిట్ అండ్ రన్' కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
Rajasthan: రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జనవరి 30న జరిగిన 'హిట్ అండ్ రన్' కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. అది రోడ్డు ప్రమాదం కాదని, భార్యే ప్రియుడితో కలిసి చేసిన పక్కా ప్లాన్ అని పోలీసులు తేల్చారు. మేఘాలయలో సంచలనం సృష్టించిన 'సోనమ్ రఘువంశీ హనీమూన్ మర్డర్' తరహాలోనే ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగింది?
ఆశిష్, అంజూ అనే జంటకు మూడు నెలల క్రితమే పెళ్లయింది. జనవరి 30 రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ జంట వాకింగ్కు వెళ్లగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు అంజూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ఆశిష్ అక్కడికక్కడే చనిపోగా, తాను స్పృహ కోల్పోయానని, తన నగలు, మొబైల్ దోపిడీకి గురయ్యాయని అంజూ నమ్మబలికింది.
పోలీసుల కూపీ.. బయటపడ్డ అసలు రంగు:
కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్పీ అమృతా దుహన్ బృందానికి అంజూ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. మెడికల్ రిపోర్టులో ఆశిష్ను గొంతు నొక్కి చంపినట్లు తేలగా, అంజూకు మాత్రం చిన్న గాయం కూడా కాకపోవడం అనుమానాలను బలపరిచింది. ఆమె మొబైల్ డేటాను విశ్లేషించగా, సంజూ అనే యువకుడితో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్లు వెల్లడైంది.
ప్రియుడితో కలిసి స్కెచ్:
పెళ్లికి ముందే సంజూతో ప్రేమలో ఉన్న అంజూ, అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం జనవరి 30న సంజూ, మరో ఇద్దరు స్నేహితులు (రోహిత్, బాదల్) కలిసి ఆశిష్పై దాడి చేసి చంపేశారు. దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు తన నగలను ప్రియుడికి ఇచ్చి, రోడ్డుపై స్పృహ తప్పినట్లు అంజూ డ్రామా ఆడింది. ప్రస్తుతం పోలీసులు అంజూతో పాటు ఆమె ప్రియుడిని, మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.