ఉధంపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్: జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఖతం.. ఉగ్రవాదుల గుహను పేల్చేసిన ఆర్మీ!

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఉధంపూర్ జిల్లా బంసంత్‌ఘర్ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Update: 2026-02-04 09:50 GMT

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఉధంపూర్ జిల్లా బంసంత్‌ఘర్ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వీరిలో నిషేధిత ఉగ్రవాద సంస్థ 'జైషే మహ్మద్'కు చెందిన మోస్ట్ వాంటెడ్ టాప్ కమాండర్ మావి అలియాస్ మావియా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.

బంసంత్‌ఘర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ మరియు సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు సంయుక్తంగా రంగంలోకి దిగారు. మంగళవారం నుంచి ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న దళాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

అటవీ ప్రాంతంలోని ఒక రహస్య గుహలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందినట్లు గుర్తించిన జవాన్లు, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని కోరినప్పటికీ ఉగ్రవాదులు మొండిగా వ్యవహరించడంతో, భద్రతా దళాలు ఆ గుహను పేల్చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మావితో పాటు మరో గుర్తు తెలియని ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన రెండో ఉగ్రవాది వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో గాలింపు చర్యలను (Search Operation) మరింత ముమ్మరం చేశారు. భద్రతా దళాల మధ్య ఉన్న సమన్వయమే ఈ ఆపరేషన్ విజయానికి కారణమని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News