Missing Crisis in Delhi: ఢిల్లీలో కనిపించకుండా పోతున్న జనం..15 రోజుల్లో 800 మంది అదృశ్యం..అసలేం జరుగుతోంది?
ఢిల్లీలో కనిపించకుండా పోతున్న జనం..15 రోజుల్లో 800 మంది అదృశ్యం..అసలేం జరుగుతోంది?
Missing Crisis in Delhi: భారత రాజధాని ఢిల్లీలో ప్రజా రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. 2026 సంవత్సరం ప్రారంభమైన మొదటి 15 రోజుల్లోనే (జనవరి 1 నుంచి 15 వరకు) ఏకంగా 800 మందికి పైగా అదృశ్యమైనట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అంటే సగటున రోజుకు 54 మంది కనిపించకుండా పోతున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు, బాలికలే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదృశ్యమైన 800 మందిలో 509 మంది మహిళలు ఉండగా, 298 మంది పురుషులు ఉన్నారు.
పోలీసు రికార్డుల ప్రకారం..ఈ 15 రోజుల్లో 191 మంది మైనర్లు అదృశ్యమయ్యారు. అంటే ప్రతిరోజూ సగటున 13 మంది చిన్నారులు మాయమవుతున్నారు. అదృశ్యమైన మైనర్లలో 146 మంది బాలికలే కావడం గమనార్హం. వీరిలో 12 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న కౌమార దశ వారు 169 మంది ఉన్నారు. పోలీసులు ఇప్పటివరకు కొంతమంది ఆచూకీ కనిపెట్టినప్పటికీ, సుమారు 71 శాతం మంది టీనేజర్ల వివరాలు ఇంకా లభించలేదు. ముఖ్యంగా 8 ఏళ్ల లోపు ఉన్న చిన్న పిల్లలు కూడా అదృశ్యమవుతుండటం తల్లిదండ్రులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
అదృశ్యమైన వారిలో పెద్దల సంఖ్య కూడా భారీగానే ఉంది. జనవరి మొదటి పక్షం రోజుల్లో 616 మంది పెద్దలు మిస్ అయ్యారు. వీరిలో 363 మంది మహిళలు, 253 మంది పురుషులు ఉన్నారు. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 181 మంది పెద్దల ఆచూకీ మాత్రమే దొరికింది. మిగిలిన 435 మంది ఎక్కడికి వెళ్లారు? వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఏదైనా ముఠా పనినా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత పదేళ్ల డేటాను (2016 - 2026) విశ్లేషిస్తే ఢిల్లీలో మిస్సింగ్ కేసులు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన పదేళ్లలో మొత్తం 2,32,737 మంది అదృశ్యమవ్వగా, సుమారు 52,000 కేసుల్లో ఇప్పటికీ బాధితుల ఆచూకీ దొరకలేదు. 2025లో అత్యధికంగా 24,508 మంది అదృశ్యమయ్యారు. సాధారణంగా కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వంటి కారణాలు ఉన్నప్పటికీ.. ఇంత భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు మాయమవ్వడం వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.