అరుణాచల్‌లో హైటెన్షన్: కానిస్టేబుల్‌ను చంపి తిన్న పులి.. రెండు రోజులకే బుల్లెట్ గాయాలతో శవమై ప్రత్యక్షం!

అడవి జంతువులకు, మనుషులకు మధ్య జరుగుతున్న ఘర్షణ అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Update: 2026-02-06 08:59 GMT

అడవి జంతువులకు, మనుషులకు మధ్య జరుగుతున్న ఘర్షణ అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని మయోడియా ప్రాంతంలో ఒక హెడ్ కానిస్టేబుల్ పులి దాడిలో మరణించగా, సరిగ్గా రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక ఆడపులి బుల్లెట్ గాయాలతో శవమై కనిపించడం సంచలనం రేపుతోంది.

అసలేం జరిగింది?

సోమవారం సాయంత్రం చిక్సెంగ్ మన్పాంగ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన బైకుపై వెళ్తుండగా అడవిలో మాయమయ్యారు. మంగళవారం ఉదయం వెతకగా, అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైంది. పులి దాడి చేసి మృతదేహాన్ని సగం వరకు తినేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రతీకార హత్యేనా?

కానిస్టేబుల్ మృతితో ఆగ్రహించిన స్థానికులు పులిని అంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం అటవీ ప్రాంతంలో ఒక ఆడపులి మృతదేహం లభ్యమైంది. దానిపై బుల్లెట్ గాయాలు ఉండటంతో, ఎవరో కావాలనే కాల్చి చంపినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు.

కానిస్టేబుల్ మరణానికి ప్రతీకారంగా ఎవరైనా ఆ పులిని వేటాడారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన పులి ఇదేనా లేక వేరేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

జంతు ప్రేమికుల ఆందోళన

అటవీ భూముల ఆక్రమణ, జంతువుల ఆవాసాలు దెబ్బతినడమే ఇటువంటి దాడులకు కారణమని వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి, మరోవైపు అంతరించిపోతున్న పులి మరణించడంపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.

Tags:    

Similar News