ప్రియుడి మోజులో కోడలు కిరాతకం: అత్తను చంపి.. దొంగతనం డ్రామా ఆడి చివరకు..!
Lucknow: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడమే కాకుండా, కన్నవారిని, కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నాయి.
ప్రియుడి మోజులో కోడలు కిరాతకం: అత్తను చంపి.. దొంగతనం డ్రామా ఆడి చివరకు..!
Lucknow: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడమే కాకుండా, కన్నవారిని, కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ఓ కోడలు, తన ప్రియుడితో కలిసి అత్తను గొంతు నులిమి చంపేసిన దారుణం నిషాత్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
నిషాత్ గంజ్ నివాసి త్రిదేశ్, రంజన భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. త్రిదేశ్ తల్లి నిర్మలాదేవి కూడా వారితోనే నివసిస్తున్నారు. అయితే, వీరి ఇంటి పెంట్ హౌస్లో రాజన్ అనే వ్యక్తి అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో రంజనకు, రాజన్కు మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంట్లో లేని సమయంలో రంజన పెంట్ హౌస్కు వెళ్లి రాజన్తో గడిపేది.
వీరిద్దరి వ్యవహారం అత్త నిర్మలాదేవి కంటపడింది. పద్ధతి మార్చుకోవాలని, కొడుకుకు తెలిస్తే సంసారం కూలిపోతుందని ఆమె కోడలిని పలుమార్లు మందలించింది. దీంతో తమ సుఖానికి అత్త అడ్డుగా ఉందని భావించిన రంజన, ప్రియుడితో కలిసి ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
ఇటీవల త్రిదేశ్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో, రంజన తన ప్రియుడు రాజన్తో కలిసి నిర్మలాదేవి కాళ్లు, చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లోని నగలను ప్రియుడికి ఇచ్చి పంపేసింది. ఎవరో దొంగలు వచ్చి నగలు దోచుకెళ్లి, అత్తను చంపేశారని నమ్మించేలా సీన్ క్రియేట్ చేసింది. అనంతరం భర్తకు, పోలీసులకు సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన పోలీసులు రంజనను విచారించగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా రంజన ఎఫైర్ విషయం బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అక్రమ సంబంధం కోసం అత్తను చంపినట్లు ఆమె అంగీకరించింది. నిందితురాలు రంజనతో పాటు ఆమె ప్రియుడు రాజన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.