Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో మారిన పరిణామాలు

Himachal Pradesh: గవర్నర్ ‎శివప్రతాప్‌ శుక్లాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

Update: 2024-02-28 07:40 GMT

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో మారిన పరిణామాలు

Himachal Pradesh: రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం వైపు అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాషాయదళం సిద్ధమైంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లారు. వారంతా బీజేపీతో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గవర్నర్‌ శివ ప్రతాస్‌ శుక్లాతో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిందని జై రాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వ్యూహాలు రచిస్తోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెలేలతో చర్చలు జరిపేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతోపాటు డీకే శివకుమార్​ను పరిశీలకులుగా నియమించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు ఇరువురు నేతలు సీమ్లా చేరుకున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఒక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సునాయాసమని అంతా అనుకున్నారు. కానీ భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకు ఓటేశారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీకి 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడం వల్ల నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో బీజేపీకి చెందిన హర్ష్‌ మహాజన్‌ను అదృష్టం వరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఓడిపోయారు.

Tags:    

Similar News