India vs Pak: దెబ్బ మీద దెబ్బ.. యుద్ధంతో పూర్తిగా దివాలా తీయనున్న పాకిస్థాన్
India vs Pak: భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం పాకిస్థాన్ను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్కు ఏ మాత్రం లేదు.
India vs Pak: దెబ్బ మీద దెబ్బ.. యుద్ధంతో పూర్తిగా దివాలా తీయనున్న పాకిస్థాన్
India vs Pak: భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం పాకిస్థాన్ను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్కు ఏ మాత్రం లేదు. పాకిస్థాన్ అంతర్గత ఖజానా పూర్తిగా ఖాళీఅయి చాలాకాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోలు వరకూ చాలా నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధార పడే పాక్ కి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవి ఇప్పుడు దాదాపు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతమున్న నిల్వలు మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్ను ఆర్థికంగా ఆదుకోవటానికి ఎవ్వరూ ఇప్పుడు ముందుకు వచ్చేలా లేరు.
అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే CEIC లెక్కల ప్రకారం... డిసెంబరు 2024 నాటికి పాకిస్థాన్ అప్పు 131 బిలియన్ డాలర్లు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది పాకిస్థాన్. ఆర్థికంగా దివాలా.. పాక్ GDPలో అప్పుల వాటా ఇప్పటికే 75 శాతానికి చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచదేశాల్లో ముద్ర పడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం లాంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్కు అసాధ్యంగా మారనున్నాయి.
మరోవైపు ఇతర దేశాల నుంచి నిధులు వచ్చే మార్గాలు కూడా పాకిస్థాన్ కి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు సతమతమవుతోంది పాక్. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి ఆ దేశానికి లేదు. సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్థాన్కు అంతులేని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళుతున్న భారత్తో యుద్ధానికి దిగడం ఏమాత్రం సరికాదని నిపుణులు చెబుతున్నారు.
అటు ఇంటిపోరు... అటు ఆర్థిక ఇబ్బందులకు తోడు.. రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్థాన్లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు, ఆ దేశ సైన్యానికీ కూడా సవాలు విసురుతోంది. తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సి వస్తోంది. భారీగా ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తోంది. ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్తో ఆ ప్రాంతంపై పాక్ పట్టుకోల్పోయినట్లు అయ్యింది. అఫ్గానిస్థాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతోనూ పాక్కు పొసగటం లేదు.
ఇంకోవైపు సింధ్లో ఇండస్ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒకరకంగా పాకిస్థాన్ అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటోంది. సైనికులు కూడా అంతంతే.. దేశ భద్రతలో కీలకమైన రక్షణవ్యవస్థ కూడా పాకిస్థాన్ కి బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యంపైనా పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోలు లాంటి నిత్యావసరాలను కూడా అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్ లాంటి శక్తిమంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్ రక్షణ నిపుణులు తేల్చి చెబుతున్నారు.