పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోంది.. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఉన్నారు.. ఇలా పొరుగున ఉన్న భారత దేశంతో పాటు ఎన్నో దేశాలు పలుసార్లు చెప్పినా ఇదంతా అసత్యం అంటూ చెప్పుకుంటూ వచ్చేది పాకిస్థాన్. అయితే, ఇప్పుడు అదే పాకిస్థాన్ తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నట్టు తొలిసారి అంగీకరించింది. అంతేకాదు 30,000-40,000 మంది శిక్షణ పొందిన సాయుధ ఉగ్రవాదులు ఉన్నట్టు లెక్క కూడా చెప్పింది.
మ భూభాగంలో మిలిటెంట్ సంస్థలు పనిచేస్తున్న విషయాన్ని గత ప్రభుత్వాలు అమెరికాకు చెప్పకుండా నిజాన్ని తొక్కిపెట్టాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారమిక్కడ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
మా దేశంలో 30,000-40,000 మంది శిక్షణ పొందిన సాయుధ ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా కశ్మీర్, అఫ్గానిస్థాన్లలో పనిచేసినవారేనని ఆయన చెప్పారు. 2014లో పాకిస్థానీ తాలిబన్లు పెషావర్లోని సైనిక పాఠశాలలో 150 మంది చిన్నారులను ఘోరంగా హతమార్చారు. దీంతో దేశంలో ఏ ముష్కర సంస్థనూ అనుమతించకూడదన్న ప్రణాళికకు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతించాయి. మిలిటెంట్ సంస్థలను నియంత్రణలోకి తీసుకుని, వాటిని నిరాయుధీకరిస్తున్న తొలి పాకిస్థాన్ ప్రభుత్వం మాది అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
అయితే, గత ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత సైనిక వాహన శ్రేణిపై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా (ముంబయి దాడులకు వ్యూహం పన్నిన లష్కర్-ఎ-తొయిబా అనుబంధ సంస్థ)కు చెందిన ఆస్తులపై పాకిస్థాన్ ప్రభుత్వం దాడులు నిర్వహించింది. దీన్ని తమ ప్రభుత్వ ఘనతగా ఖాన్ చెప్పుకొచ్చారు.