Nepal Political Turmoil: భారత వ్యతిరేక ప్రకటనలపై అసమ్మతి.. ప్రధాని రాజీనామాకు ఒత్తిళ్ల

Nepal Political Turmoil: నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నియంత పోకడలు, భారత్‌ వ్యతిరేక ప్రకటనల నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ఈ నెల 6న కీలక భేటీ నిర్వహించనుంది.

Update: 2020-07-05 13:33 GMT

Nepal Political Turmoil: నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నియంత పోకడలు, భారత్‌ వ్యతిరేక ప్రకటనల నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ఈ నెల 6న కీలక భేటీ నిర్వహించనుంది. ప్రధానమంత్రి ఓలీ రాజీనామాకు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత పుష్ప కమల్‌ దహల్‌ ప్రధాని ఓలీతో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది.

మరోవైపు ప్రధాని ఓలీ రాజీనామాకు నేతలు పట్టుబడుతున్నారు. దీంతో పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. 45 మంది సభ్యులతో కూడిన ఎన్‌సీపీ స్టాండింగ్‌ కమిటీ ఈనెల 4న భేటీ కావాల్సి ఉండగా... చివరినిమిషంలో సమావేశం వాయిదాపడింది. ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ సహ అధ్యక్ష పదవికీ కూడా ఆయన రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేకులు పట్టుబడుతుండగా... పదవుల నుంచి వైదొలగేందుకు ఓలీ సుముఖంగా లేరని హిమాయలన్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఒప్పందానికి భిన్నంగా పూర్తికాలం పదవిలో​ కొనసాగేందుకు ఓలీకి అవకాశం ఇచ్చినా... దేశాన్ని సమర్ధంగా ముందుకు నడిపించడంలో విఫలమయ్యారని ఎన్‌సీపీ సీనియర్‌ నేత దహల్‌ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఎన్‌సీపీలో చిచ్చురేపుతోందని పార్టీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు హరిబోల్‌ గజురెల్‌ తెలిపారు. ఓలీ, దహల్‌లు తమ మంకుపట్టు వీడకపోవడంతో పార్టీలో ప్రతిష్టంభన కొనసాగుతోందని వెల్లడించారు.

మరోవైపు నేపాల్‌ ప్రధాని పదవి నుంచి ఓలీని తప్పించేందుకు దహల్‌ వర్గీయులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందని ఎన్‌సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఓలీ వ్యవహారశైలిపై భగ్గుమంటున్న మాధవ్ కుమార్ , పుష్ప కమల్ దహల్, నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్‌ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్‌ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ప్రధాని ఓలీ ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News