Global Warming : గత 140 ఏళ్లలో ఇదే టాప్.. భూమి వేడెక్కే వేగం పెరిగిందట.. 2030 నాటికి ఎంత ఉంటుందంటే ?
Global Warming : భూ ఉష్ణోగ్రత దశాబ్దానికి 0.35°C మేర పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్ల 2030 నాటికి గ్లోబల్ వార్మింగ్ లక్ష్మణ రేఖను దాటే ప్రమాదం పొంచి ఉంది.
Global Warming Alert
Global Warming : భూమి వేడెక్కుతోంది.. ఇది మనం వింటున్న పాత వార్తే కావొచ్చు, కానీ ఇప్పుడు పెరుగుతున్న వేగం చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకప్పుడు దశాబ్ద కాలంలో స్వల్పంగా పెరిగే ఉష్ణోగ్రతలు, ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ వెల్లడించిన గణాంకాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గత పదేళ్లలో భూమి వేడెక్కే వేగం మునుపెన్నడూ లేని రీతిలో పెరిగిందని, ప్రతి దశాబ్దానికి ఉష్ణోగ్రత సగటున 0.35°C మేర పెరుగుతోందని ఈ నివేదిక బాంబు పేల్చింది.
గతంతో పోలిస్తే విపరీతమైన మార్పు
నిజానికి 1970 నుంచి 2015 వరకు చూస్తే, ప్రతి పదేళ్లకు ఉష్ణోగ్రత పెరుగుదల 0.2°C కంటే తక్కువగానే ఉండేది. కానీ గత పదేళ్లలో ఇది దాదాపు రెట్టింపు అవ్వడం గమనార్హం. అంటే మనం ఊహించిన దానికంటే వేగంగా భూమి నిప్పుల కొలిమిలా మారుతోంది. 1880లో ఉష్ణోగ్రతల రికార్డింగ్ మొదలైనప్పటి నుంచి, అత్యంత వేగంగా వేడెక్కిన దశాబ్దం ఇదేనని శాస్త్రవేత్తలు 98 శాతం నమ్మకంతో చెబుతున్నారు. ముఖ్యంగా 2023 నుంచి 2025 వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు భూమి సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ కాలం కంటే 1.5°C ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
కారణం ఎవరు? ప్రకృతి కాదా?
సాధారణంగా ఎల్ నినో, అగ్నిపర్వత పేలుళ్లు, సూర్యుడిలో వచ్చే మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే, వీటిని పక్కన పెట్టి చూసినా ఉష్ణోగ్రత పెరుగుదల ఆగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం మానవ కార్యకలాపాలేనని తేలిపోయింది. పెరిగిన వాహనాల వినియోగం, పారిశ్రామిక ఉద్గారాలు, అడవుల నరికివేత వల్ల వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు పెరిగిపోయి భూమిని వేడి చేస్తున్నాయి. 2030 నాటికి మనం నిర్దేశించుకున్న 1.5°C లక్ష్మణ రేఖను శాశ్వతంగా దాటేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిష్కారం మన చేతుల్లోనే ఉందా?
గ్లోబల్ వార్మింగ్ అనే భూతాన్ని అరికట్టాలంటే మాటలు సరిపోవు, తక్షణ కార్యాచరణ అవసరం. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే ఏకైక మార్గం. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి.. సౌర శక్తి, పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేయాలి. ఒకవేళ ఇప్పుడే మనం మేల్కోకపోతే, రాబోయే తరాలకు నివాసయోగ్యం కాని భూమిని మిగిల్చిన వారమవుతామని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు.